రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందని ఆవేదనతో పోరాడుతుంటే.. తమపైనే దాడికి దిగుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెదేపా కార్యాలయాలపై వైకాపా దాడిని నిరసిస్తూ.. అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్న.. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను డీజీపీ భ్రష్టుపట్టించారని అన్నారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులు అర్పిస్తున్నామన్న ఆయన.. ప్రాణత్యాగం చేసిన పోలీసుల ఆత్మలు డీజీపీ తీరుతో ఘోషిస్తున్నాయని అన్నారు.
‘‘రెండున్నరేళ్లలో పోలీస్ వ్యవస్థను డీజీపీ భ్రష్టుపట్టించారు. జగన్, వైకాపా నేతలు వాడిన పదజాలంపై బహిరంగ చర్చకు సిద్ధమా? ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. సీఎం, డీజీపీ కలిసి కుట్రపన్ని చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించారు. నివాసం తర్వాత పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారు. తెదేపా నేతల ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూ అరాచకం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమిది. దేశ చరిత్రలో ఎప్పుడూ ఈ రీతిలో జరగలేదు. సమాజ చైతన్యం కోసమే 36గంటల దీక్ష. తప్పుచేసిన ఏ ఒక్కరినీ వదలం. అధికారంలోకి రాగానే.. ఏ మూల దాక్కున్నా లాగి వడ్డీతోసహా చెల్లిస్తాం. సర్వేల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమైంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే వైకాపా ప్రతి దీక్షలకు దిగుతోంది. రాష్ట్రంలో లభ్యమయ్యే నాసిరకం మద్యంలో మాదకద్రవ్యాలు కలుపుతున్నారు. రాష్ట్రానికి గంజాయి కొత్త కాదని డీజీపీ మాట్లాడటం దుర్మార్గం. - అచ్చెన్నాయుడు
ఇదీ చదవండి: PATTABHI RAM : నేడు కోర్టు ముందుకు పట్టాభి