కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్త లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఇళ్లల్లో ఖాళీగా ఉంటున్న ప్రజలు ఆన్లైన్లోనే ఎక్కువసేపు గడుపుతున్నట్లు గురుగ్రామ్ కేంద్రంగా పని చేస్తున్న బాబుల్ ఏఐ సంస్థ సర్వేలో తేలింది. లాక్డౌన్ కారణంగా గతంలో కంటే ఎక్కువ సమయం ఓటీటీ, విద్యా, వ్యాయామ యాప్లలో గడుపుతున్నారని సర్వే తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్లు కూడా భారీగా పెరిగినట్లు పేర్కొంది.
ఎంటర్టైన్మెంట్ యాప్లలో ఇలా..
కొవిడ్ వ్యాప్తి తర్వాత దేశంలో జూమ్, హ్యాంగవుట్, గూగుల్ డ్యుయో, హౌస్పార్టీ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్లలో నెటిజన్లు వెచ్చించే సమయం 71 శాతం పెరిగిందని సర్వే వెల్లడించింది. ఆయా యాప్లలో యాక్టివ్ వినియోగదారుల సంఖ్య 104 శాతం వృద్ధి చెందినట్లు తెలిపింది.
ఓటీటీ యాప్లు అయిన హాట్స్టార్, అమెజాన్, నెట్ఫ్లిక్స్లను వినియోగించే సమయం.. 81 శాతం పెరిగిందని సర్వేలో వెల్లడైంది.
వ్యాయామ విభాగంలో ఇలా...
లాస్ వెయిట్ ఎట్ హోమ్ యాప్లో వినియోగదారులు గడిపే సమయం 46.98 శాతం పెరిగింది. ఇవే కాకుండా ఈ-లెర్నింగ్ ప్లాట్ఫాంలు ఉడెమీ, అన్అకాడమీ, బైజూస్ వంటి వాటి యాప్లను క్రితంతో పోలిస్తే యూజర్లు 82.73 శాతం అధికంగా వినియోగిస్తున్నారు.
విపరీతంగా పెరిగిన సోషల్ మీడియా వినియోగం
లాక్డౌన్ అమలు వల్ల సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్ యాప్ల వాడకం కూడా విపరీతంగా పుంజుకుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి యాప్లలో వినియోగదారులు గడిపే సమయం 46.28 శాతం పెరిగింది.
ఇదీ చదవండి: మలేరియా మందు ఎగుమతులపై కేంద్రం కొత్త ట్విస్ట్