పిల్లలకు తల్లిని మించిన భరోసా ఉండదు. అమ్మను మించిన ఆదరణ ఎక్కడా దొకరదు. తను తినకున్నా.. కన్నపిల్లల కడుపు నింపాలనే ఆశయంతో బతుకు పోరాటంలో సమిధలవుతున్న ఎందరో మాతృమూర్తులు ఉన్న ఈ సమాజంలో.. అమ్మతనానికే మచ్చతెచ్చె తల్లులు కూడా ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన ఈ ఘటనను చూస్తే.. ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? అనే సందేహం రాక మానదు.
నాందేడ్లోని భోకర్ తాలూకా పాండుర్నా గ్రామానికి చెందిన ధుర్పాదబాయి గణపత్ నిమల్వాడ్ అనే మహిళ.. తన నాలుగు నెలల పాప, రెండేళ్ల అబ్బాయిని దారణంగా హత్య చేసింది. మే 31, జూన్1న వరుసగా ఈ హత్యలు చేసింది. తన సోదరుడు, తల్లితో కలిసి ఈ చిన్నారుల మృతదేహాలను పొలంలో కాల్చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితురాలు ధుర్పాదబాయితో పాటు ఆమెకు సహకరించిన తల్లి కొండబాయి రాజేమోద్, సొదరుడు మాధవ్ రాజేమోద్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కారణమేంటి?: ఆహారం కోసం పిల్లలు ఏడ్చినందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టింది ధుర్పాదబాయి. మే 31న నాలుగు నెలల కూతురు ఏడుస్తుండగా.. గొంతు నులిమి చంపేసింది. తర్వాత రోజు.. రెండేళ్ల కొడుకు దత్తా.. ఆహారం కోసం ఏడ్చాడని.. అదే రీతిలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మెట్రో స్టేషల్లో లైంగిక వేధింపులు..
దిల్లీలోని ఓ మెట్రో స్టేషన్లో తాను లైంగిక వేధింపులకు గురైనట్లు ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు దిల్లీ మెట్రో కార్పొరేషన్ అధికారులతో పాటు, పోలీసులు స్పందించారు. అసలు జరిగిన విషయాన్ని ఆమె ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వరుస ట్వీట్లతో జరిగిన విషయాన్ని అంతా చెప్పేసింది.
"గురువారం మధ్యాహ్నం బాఘ్ మెట్రో స్టేషన్లో నేను దిగగానే.. మెట్రో రైలు అడ్రస్ అడిగే నెపంతో తన దగ్గరికి ఓ వ్యక్తి వచ్చాడు. నేను అతనికి సాయం చేశాను. అనంతరం నా సేష్టన్ రాగానే నేను దిగి.. క్యాబ్ బుక్ చేసుకోవడానికి ప్లాట్ఫారమ్పై కూర్చున్నా. అదే వ్యక్తి మెట్రో ట్రైన్ అడ్రస్ కోసం మళ్లీ సంప్రదించాడు. ఈ క్రమంలో అతని జననాంగాలను నాకు చూపించే ప్రయత్నం చేశాడు." అని ట్వీట్లో ఆరోపించింది. తాను వెంటనే అక్కడ ఉన్న పోలీసు సిబ్బందిని సంప్రదించినా.. పట్టించుకోలేదని వివరించింది. ఈ ఘటన అంతా సీసీ టీవీలో రికార్డ్ అయ్యిందని తాను అతనిని గుర్తు పడతానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది ఆ మహిళ.