Neem Juice Punishment: పాఠశాలల్లో విద్యార్థులు చిన్నచిన్న తప్పులు చేసినా, హోంవర్క్ చేయకపోయినా.. చాలా చోట్ల అధ్యాపకులు కఠిన శిక్షలు విధిస్తుంటారు. బెత్తంతో కొట్టడం, గోడ కుర్చీ వేయించడం, ఎండలో నిలబెట్టడం.. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. కానీ ఆ పాఠశాల మాత్రం ప్రత్యేకం. విద్యార్థులు యూనిఫాం ధరించకపోవడం, హోంవర్క్ చేయకపోవడం సహా ఇతర తప్పులు చేస్తే ఉపాధ్యాయులు దండించడం వంటివి చేయరు. గుజరాత్ సూరత్లోని విద్యాకుంజ్ పాఠశాల.. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందించింది.
విద్యార్థులు తప్పులు చేస్తే వేపరసం తాగిస్తారు. అవును వేపరసం తాగడమే వారికి శిక్ష. ఇలా చేస్తే పిల్లలకు క్రమశిక్షణ అలవడుతుందని చెబుతున్నారు స్కూల్ డైరెక్టర్ మహేశ్ పటేల్. శారీరక దండన కంటే ఈ పద్ధతితో వారి ఆరోగ్యం కూడా బాగుంటుందని అంటున్నారు. గాంధేయ సిద్ధాంతాలతో.. ఈ పాఠశాల నడుస్తుందని, సంస్కరణాత్మక చర్యలతో విద్యార్థులకు విలువలు పెంపొందించడమే తమ ధ్యేయమని ఈటీవీ భారత్తో వెల్లడించారు.

''సక్రమంగా స్కూల్ నడిపి, ధనం ఆర్జించాలనే మేం నమ్ముతాం. అదే సమయంలో విద్యార్థుల్లో మంచి విలువలు పెంపొందించాలి. శిక్షలు విధించాల్సి వస్తే.. వేపరసం తాగించడమే మేలని నా అభిప్రాయం. ఇది ఆరోగ్యానికి మంచిది. మరోసారి తప్పులు చేయాలన్నా ఇది గుర్తొస్తుంది.''
- మహేశ్ పటేల్, పాఠశాల డైరెక్టర్
విద్యార్థుల క్రమశిక్షణకు సంబంధించి గతంలో జరిగిన ఓ విషయాన్ని కూడా ఈటీవీ భారత్కు వివరించారు పటేల్. ''ఓసారి టాయిలెట్ పైప్లైన్ ఎవరో పగలకొట్టారు. ఇది ఎవరు చేశారని నేను విద్యార్థులను అడిగా. అంతా మాకు తెలియదు అన్నారు. దీనికి నేను కూడా ఓ కారణం అని భావించి.. తర్వాతి 15 రోజులు చెప్పులు ధరించడం మానేశా. దీంతో తప్పు చేసిన విద్యార్థులు ముందుకు వచ్చారు.'' అని పటేల్ అన్నారు. స్కూల్ యాజమాన్యం విధానాలతో తమకేమీ అభ్యంతరం లేదని చెబుతున్నారు విద్యార్థులు. ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఇవో మంచి గుణపాఠాలని వివరిస్తున్నారు.

ఇవీ చూడండి: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం- యువకుడు ఆత్మహత్య!
మామిడి పండ్లు కిలో రూ.2.70లక్షలు- సెక్యూరిటీ కోసం 15 సూపర్ డాగ్స్!