Murmu President: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకార తేదీ జులై 25. అయితే.. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి జులై 25వ తేదీని ఖరారు చేయడం ఇదే తొలిసారి కాదు. గడిచిన 45 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటం విశేషం. తొలిసారిగా దేశ ఆరో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1977 జులై 25న ఆ పదవిని అలంకరించారు. అనంతరం ఆ బాధ్యతలు చేపట్టిన జ్ఞాని జైల్సింగ్ నుంచి.. తాజాగా పదవీ విరమణ చేసిన రామ్నాథ్ కోవింద్ వరకు అందరూ ఇదే తేదీన రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు.
ఈ తేదీ వెనుక ఉన్న కథేంటో చూద్దాం..
1950 జనవరి 26న డా.రాజేంద్రప్రసాద్ దేశ ప్రథమ పౌరుడిగా ప్రమాణం చేశారు. 1952 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మళ్లీ 1957లోనూ ఎన్నికయ్యారు. అనంతరం 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయ్యారు. అయితే ఆ తర్వాత పదవి చేపట్టిన కొందరు పూర్తి కాలంపాటు కొనసాగలేకపోయారు. 1967 మే 13న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన డా.జాకీర్ హుస్సేన్ మే 3 1969లో మృతిచెందారు. వీవీ గిరి తర్వాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సైతం పదవీకాలాన్ని పూర్తిచేయలేకపోయారు.
అనంతరం నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా 1977 జులై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తికాలంపాటు అత్యున్నత పదవిలో కొనసాగారు. ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్నవారంతా విజయవంతంగా తమ పదవీ కాలాన్ని ముగించారు. జులై 25న బాధ్యతలు స్వీకరించడం.. ఐదేళ్ల తర్వాత జులై 24న పదవీ విమరణ చేయడం ఆనవాయితీగా మారింది. గత 45 ఏళ్లుగా ఇదే కొనసాగుతోంది. ఇప్పటివరకు తొమ్మిది మంది రాష్ట్రపతులు ఇదే తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ముర్ము పదో వ్యక్తి కావడం విశేషం.
![Murmu become 10th successive president to take oath on July 25](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15915959_murmu.jpg)
జులై 25న ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రపతులు
- నీలం సంజీవరెడ్డి
- జ్ఞాని జైల్ సింగ్
- ఆర్. వెంకట్రామన్
- శంకర్ దయాళ్ శర్మ
- కేఆర్. నారాయణన్
- ఏపీజే. అబ్దుల్ కలాం
- ప్రతిభా దేవి సింగ్ పాటిల్
- ప్రణబ్ ముఖర్జీ
- రామ్నాథ్ కోవింద్
ఇవీ చూడండి: అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు.. ద్రౌపదీ ముర్ము ప్రస్థానం
హోటల్ హయాత్లో హైప్రొఫైల్ వ్యభిచారం.. విదేశీ యువతులు.. బడాబాబుల కోసమే!
'నచ్చింది తినలేం, చెప్పాల్సింది చెప్పలేం.. దేశంలో దారుణంగా పరిస్థితులు': ఆళ్వా