జాతీయ రహదారి పక్కనున్న ఓ హనుమాన్ దేవాలయాన్ని ఎనిమిది అడుగులు వెనక్కి జరిపారు ఇంజినీర్లు. రహదారి విస్తరణకు వీలుగా గుడిని జాగ్రత్తగా వెనక్కి జరిపారు అధికారులు. ఉత్తర్ప్రదేశ్ షాజహాన్పుర్ జిల్లా కచియాని ఖేడా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. లఖ్నవూ-దిల్లీ జాతీయ రహదారిని ఆనుకొని ఈ హనుమాన్ మందిరం ఉంది. ఆలయ మూలవిరాట్ను తాకకుండా పనులు చేస్తున్నారు.


అక్టోబర్ నెలలో హరియాణాకు చెందిన జై దుర్గే లిస్టింగ్ అండ్ షిఫ్టింగ్ కంపెనీ ఈ బాధ్యతలు చేపట్టింది. అప్పుడే పనులు ప్రారంభించింది. గత బుధవారం వరకు ఎనిమిది ఫీట్ల మేర ఆలయాన్ని వెనక్కు జరిపింది. అనుకున్న స్థానానికి ఆలయాన్ని జరపడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని షిఫ్టింగ్ కంపెనీ తెలిపింది.


జాకీలను ఉపయోగించి గుడిని వెనక్కి జరుపుతున్నట్లు వారు వెల్లడించారు. ఆలయ మూలవిరాట్ను తాకకుండా ఈ పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ హనుమాన్ దేవాలయం దాదాపు 15 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. 64 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పు కలిగి ఉంది. కాగా, ఇదే సమయంలో దేవుడి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు.