కరోనా వైరస్ను జయించేందుకు 'ఆయుష్' వైద్యులు రంగంలోకి దిగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మహమ్మారిపై భారత్ చేపట్టిన యుద్ధంలో ఆయుష్ పోషించాల్సిన పాత్ర కీలకమైందని తెలిపారు. ఆయుష్ వైద్యులు వారికి అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి, శానిటైజర్ల వంటి వైరస్ నాశినిలను ఉత్పత్తి చేయాలని కోరారు.
ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధవైద్యం, హోమియోపతి వైద్యవిద్యల సమూహమైన ఆయుష్ వద్ద కరోనాకు విరుగుడు లేదనే వాదనను పట్టించుకోవద్దన్నారు ప్రధాని. అవసరమైతే ప్రైవేటు ఆయుష్ డాక్టర్ల సాయం తీసుకుని కరోనా వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. టెలీమెడిసిన్ సాంకేతికత సాయంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఓ వీడియో ద్వారా సందేశమిచ్చారు.
కరోనా ఒత్తిడిని జయించేందుకు ప్రజలు 'ఇంట్లో యోగా చేయాలి' అని ప్రచారం చేస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖను ప్రధాని ప్రశంసించారు. భారత సంప్రదాయ వైద్యరంగాన్ని ప్రచారం చేయడం అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:విపత్తు నిధులతో వలస కూలీలకు ఆహారం, వసతి