Singareni Regularize 2364 Badili Workers : సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. సింగరేణి కాలరీస్ సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తున్నట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. సంస్థలో చేరినప్పటి నుంచి ఏడాదిలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా పర్సనల్ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఏడాదిలో నిర్ణీత మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తుండటం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.