Harish Rao On Hospital Staff Salaries : రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అమానుషమని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రికి వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయమన్నారు.
జీతాలు చెల్లించాలని సిబ్బంది ఎన్నిసార్లు నిరసనలు తెలిపినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని, వారి గోడును పట్టించుకోవడం లేదన్నారు. విషజ్వరాలు విజృంభించి రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్న సమయంలో నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. నిధులు విడుదల చేయకుండా చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి టీవీవీపీ ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.