GO 46 Victims Protest : గత ప్రభుత్వం చేసిన జీవో నంబర్ 46 తప్పిదం వల్ల తాము ఎంతో నష్టపోయామని, కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఈ సమస్య పరిష్కారంలో జాప్యం చేస్తుందని బాధితులు వాపోయారు. ప్రజాభవన్ వద్ద శుక్రవారం ఉదయం నుంచి సుమారు 200 మంది తెలంగాణా స్పెషల్ పోలీసు అభ్యర్ధులు దీక్షకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన తెలిపారు.
కేబినెట్ సబ్ కమిటీ వేసి తమకు పరిష్కారం చూపుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని అభ్యర్థులు గుర్తుచేశారు. ఇప్పుడు జీవో 317 గురించి మాట్లాడుతున్నారు తప్ప, జీవో 46 గురించి మాట్లాడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకూ ప్రజాభవన్ వద్ద నుంచి కదిలేదే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.