Harish Rao on Govt School Issues : ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవటం వల్లే గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం, సరైన సౌకర్యాలు అందటం లేదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నేడు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. రంగారెడ్డి పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థులు చేసిన నిరసనకు మద్దతుగా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు, నడిరోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారన్నారు.
పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతుందని హరీశ్రావు మండిపడ్డారు. నడిరోడ్డెక్కి నినాదిస్తున్న వారి ఆవేదనను మానవత్వంతో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.