CS Santhi Kumari Review On Praja Palana Dinotsavam 2024 : ఈనెల 17న పబ్లిక్ గార్డెన్లో ప్రజాపాలనా దినోత్సవం నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అనంతరం పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. పబ్లిక్ గార్డెన్లో పోలీస్ గౌరవ వందనం స్వీకరించి ప్రసంగిస్తారన్నారు.
ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. సభా స్థలంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆహ్వానితుల వాహనాలకు పార్కింగ్ సదుపాయం, శానిటేషన్, భద్రతా తదితర ఏర్పాట్లను చేపట్టాలని శాంతికుమారి అన్నారు. అదే రోజున గణేష్ నిమజ్జనం ఉన్నందున ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు.