Harish Rao Raised On Students Problems : రాష్ట్రంలో ఐటీఐలు, గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయని మాజీమంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని ఎక్స్ వేదికగా విమర్శించారు. పెద్దపల్లి, సంగారెడ్డి, అదిలాబాద్ ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఐటీఐల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, టాయిలెట్స్ లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
గురుకులాల పరిస్థితి నానాటికీ దిగజారుతోందన్న హరీశ్రావు, కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంక్లలో పాకురు పట్టి ఉంటున్నాయని, ఆ నీటినే విద్యార్థులు స్నానానికి, ఇతర అవసరాలకు వాడుతుండటంతో చర్మవ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఇన్ని సమస్యల మధ్య విద్యార్థులు చదువుపై ఎలా దృష్టి సారిస్తారని ప్రశ్నించిన హరీశ్రావు, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీఐలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.