Modi Russia Visit 2024 : ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో మరోసారి పర్యటించనున్నారు. మాస్కో అధ్యక్షతన వచ్చే వారంలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొనున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. రష్యాలోని కజన్ వేదికగా ఈనెల 22 నుంచి 24 వరకు 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా మోదీని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈనెల 22 నుంచి 23 వరకు మోదీ రష్యాలో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.
ఈ సందర్భంగా బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అంతర్జాతీయంగా కీలక అంశాలపై బ్రిక్స్ దేశాధినేతలు చర్చించనున్నారు. బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడానికి, భవిష్యత్ సహకారం కోసం అనువైన రంగాలను గుర్తించడానికి ఈ శిఖరాగ్ర సమావేశం విలువైన అవకాశాన్ని అందిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.