PM Modi Biden Phone Call : చర్చలు, దౌత్యం ద్వారా ఉక్రెయిన్లో త్వరగా శాంతి నెలకొనేందుకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఫోన్ చేసి చెప్పారు. ఈ సందర్భంగా తన ఉక్రెయిన్ పర్యటన వివరాలను పంచుకున్నారు. ఉక్రెయిన్, బంగ్లాదేశ్ సహా ఇతరప్రాంతీయ, ప్రపంచవ్యాప్త సమస్యలను బైడెన్తో పంచుకున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితులను పునరుద్ధరించటం, మైనార్టీలు ముఖ్యంగా హిందువులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
బంగ్లాదేశ్ పరిస్థితులపై ఇరువురు నేతలూ ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. క్వాడ్సహా బహుపాక్షిక వేదికలపై సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు మోదీ, బైడెన్ తమ నిబద్ధతను పునరుద్ఘాటించారని తెలిపింది. భారత్-అమెరికా భాగస్వామ్యం రెండుదేశాల ప్రజలతో పాటు యావత్ మానవాళికి ప్రయోజనం చేకూర్చనుందని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది.