Jharkhand CM Floor Test : ఝార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం విజయం సాధించింది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో సోరెన్ సర్కారుకు 45మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. స్వతంత్ర శాసన సభ్యుడు సరయూ రాయ్ విశ్వాస పరీక్ష ఓటింగ్లో పాల్గొనలేదు.
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చకు అసెంబ్లీ స్పీకర్ రవీంద్ర నాథ్ మహతో గంట సమయం కేటాయించారు. చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు సోరెన్ సర్కార్కు వ్యతిరేకంగా నినదిస్తూ, సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం జరిగిన విశ్వాస పరీక్షలో సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. కాగా, ఇటీవలే జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్ జులై 4 ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం అసెంబ్లీలో తాజాగా బలనిరూపణ చేసుకున్నారు.