Jammu and Kashmir 1st Phase Polling : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం 24 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 61శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పీకే పోలె వెల్లడించారు. గత 35 ఏళ్లలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు.
ఇక కిశ్త్వాద్ జిల్లాలో అత్యధికంగా 77 శాతం, పుల్వామా జిల్లాలో అత్యల్పంగా 46 శాతం ఓటింగు నమోదైందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల వివరాలు, మారుమూల ప్రాంతాల నుంచి తుది నివేదికలు వచ్చాక ఈ సంఖ్యలో మార్పు ఉండవచ్చని చెప్పారు. కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా తీవ్రమైన అవాంఛనీయ ఘటనలు ఎక్కడా నమోదు కాలేదని సీఈవో చెప్పారు. మిగతా 66 నియోజకవర్గాలకు సెప్టెంబరు 25, అక్టోబరు 1 తేదీల్లో రెండు, మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.