Internet Shutdown In Manipur : మణిపుర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఇంటర్నెట్పై నిషేధం విధించింది. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న క్రమంలో ఐదు రోజుల పాటు అంతర్జాలంపై నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే ఫొటోలు పంచుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
రాష్ట్ర డీజీపీ, మణిపుర్ ప్రభుత్వ భద్రతా సలహాదారుని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాజ్భవన్ వైపు కవాతు చేసేందుకు ఆందోళనకారులు యత్నించారు. అడ్డుకున్న భద్రతాబలగాలపైకి రాళ్లు, కర్రలను విసిరారు. ఫలితంగా భద్రతా బలగాలు నిరసనకారులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి. ఈ ఘటనలో 40 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు.