By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 3:50 PM IST
కొమ్మనపల్లిలో ప్రబలిన అతిసారం - ఒకరు మృతి, 50 మందికి అస్వస్థత - Woman Dead Diarrhea in Kommanapalli
Woman Dead of Diarrhea in Kommanapalli: కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనపల్లిలో అతిసారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అతిసారం కారణంగా ఓ మహిళ మృతి చెందగా సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఊరిలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురైన వారికి వైద్య బృందాలు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. అతిసారానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఐదుగురు బాధితుల పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాగు నీటిని వైద్య బృందం ల్యాబ్లకు పంపింది. అంతే కాకుండా బాధితులు తీసుకున్న ఆహారంలో ఏమైనా ఇబ్బంది ఉందేమోనని పరిశీలిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రత్యేకంగా వైద్య బృందాలు పరిశీలిస్తున్నాయి. గ్రామంలో అతిసారం ప్రబలడానికి గల కారణాలను ఇంటింటికీ వెళ్లి వైద్యులు అన్వేషిస్తున్నారు. గ్రామంలోని నీరు, ఆహర నమూనాలను వైద్య బృందం పరిశీలిస్తుంది. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం అనిపిస్తే వెంటనే వైద్య శిబిరం వద్దకు రావాలని అధికారులు కోరారు.