చివరి రోజు సందర్శకులతో ఉత్సాహంగా సాగిన వింగ్స్ ఇండియా ప్రదర్శన
Published : Jan 21, 2024, 10:31 PM IST
Wings India 2024 Last Day Celebrations : హైదరాబాద్లో నాలుగు రోజుల కిందట ప్రారంభమైన వింగ్స్ ఇండియా-2024 వైమానిక ప్రదర్శన చివరి రోజు ఎంతో ఆడంబరంగా కొనసాగింది. విమాన ప్రదర్శనలు వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా సందర్శకులు వచ్చారు. ప్రేక్షకులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన డీజే సౌండ్ ప్రదర్శన చిన్నారులను ఆకట్టుకుంది. చివరి రోజు కావడంతో కుటుంబసమేతంగా సందర్శకులు వచ్చారు. దీంతో విమానాశ్రయ పరిసరాలు సందడిగా మారాయి.
రాష్ట్ర ప్రభుత్వం సైతం దీని ద్వారా విమాన తయారీ సంస్థలు, ఆపరేటర్ల మధ్య విమానాల సరఫరాకు సంబంధించి చర్చలు సైతం జరిపినట్లు అధికారులు వెల్లడించారు. వింగ్స్ ఇండియా ప్రదర్శన తిలకించేందుకు వచ్చిన సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు చేపట్టారు. చివరి రోజు దాదాపు 25 వేల మంది వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ వింగ్స్ ఇండియా ప్రదర్శనను తాము ఎంతో ఆనందంగా తిలకించామని సందర్శకులు వెల్లడించారు. చిన్నారులు ఈ ప్రదర్శన పట్ల తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.