thumbnail

ప్రాణం తీసిన ఈత సరదా - గొల్లపల్లి జలాశయంలో ఇద్దరు మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : 1 hours ago

Two Died in Gollapalli reservoir: ఈతకు వెళ్లి నీటిలో మునిగిపోయి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటుచేసుకుంది. దసరా పండుగ సందర్భంగా ఆనందోత్సాహాల మధ్య ఉన్న ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెనుకొండ మండలంలోని గొల్లపల్లి జలాశయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. 

విహారయాత్రలకు వెళ్లి విడిచిరాని లోకాలకు : హిందూపురంలోని నింకంపల్లికి చెందిన అనీస్ ఖాన్(42) కుటుంబంతో కలిసి విహారయాత్రకు గొల్లపల్లి జలాశయానికి వచ్చి జలాశయంలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. పెనుకొండ మండలంలోని అమ్మవారి పల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి(19) అనే మరో యువకుడు ఆదివారం జలాశయంలో గల్లంతవ్వడం గమనార్హం. అగ్నిమాపక శాఖ గజఈతగాళ్లతో గాలించిన తర్వాత మృతదేహం లభ్యం కావడంతో విషయం వెలుగు చూసింది. సోమవారం ఉదయం శవాన్ని  స్థానికుల సహాయంతో బయటకు తీశారు.

కుటుంబానికి అండగా ఉంటాం- మంత్రి సవిత: విషయం తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గొల్లపల్లి జలాశయానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుడు చంద్రశేఖర్ రెడ్డి అనంతపురంలోని శ్రీ వాణి డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచ్చి విహారయాత్ర కోసం వెళ్లి నీటిలో మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.