By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 5:04 PM IST
అసలే ఎండాకాలం, ఆపై నీటికొరత - మన్యం జిల్లాలో గిరిజనుల దాహం కేకలు - Tribals Drinking Water Problem
Tribals Facing Drinking Water Problem: అల్లూరి జిల్లాలోని గిరిజనులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. హుకుంపేట మండలం గుమ్మడి గండువలో సుమారు 70 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. అయితే ఎన్నో ఏళ్లుగా తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. విసిగి పోయిన గిరిజనులు ఇంటికి 3 వేల రూపాయల చొప్పున చందాలు వసూలు చేసి భీమవరం పంచాయితీ నుంచి పైపులైన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే డబ్బులు సరిపోక పోవడం వల్ల పైపులైన్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఇంకా ఒక కిలోమీటర్ మేర పైపులైన్ నిర్మాణం చేయాల్సి ఉంది. దీంతో వారంతా మళ్లీ అధికారుల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
"మా గ్రామంలో 74 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తాగునీరు లేక మేం తీవ్ర అవస్థలు పడుతున్నాం. దీనిపై అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో మేమే ఇంటికి రూ. 3వేలు చొప్పున చందా వసూలు చేసి పైపులైన్ నిర్మాణం చేపట్టాం. కానీ డబ్బులు లేక కిలోమీటర్ మేర పైపులైను పనులు ఆగిపోయాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి మా గ్రామంలో తాగునీటి సమస్యకు తగిన చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం." - గ్రామస్థులు