ఆ బిల్డర్లకు మార్ట్గేజ్ డీడ్స్ ఎలా మంజూరు చేస్తారు- హైకోర్టులో ఆనం పిటీషన్ - TDP LEADER ANAM PIL ON HIGH COURT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2024, 3:33 PM IST
TDP Leader Anam Venkata Ramana Reddy Filed PIL in High Court : నిబంధనలకు విరుద్ధంగా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించిన బిల్డర్లకు మార్ట్గేజ్ డీడ్స్(తనఖా దస్తావేజులు) విడుదల చేసిన అధికారులపై విచారణకు ఆదేశించాలని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. నివాసానికి యోగ్యమైనవా? నిబంధనలను పాటించారా? లేదా? అనే విషయాలు పరిగణలోకి తీసుకోకుండా అప్పటి పురపాలక కమిషనర్లు నిధులు విడుదల చేశారన్నారు. 2019 జూన్ నుంచి 2024 జూన్ మధ్యకాలంలో పూర్వ కమిషనర్లు హరిత, వికాస్ మర్మత్, డిప్యూటీ కమిషనర్ డి.చెన్నుడు అధికార దుర్వినియోగం చేశారన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన భవనాలు, అపార్ట్మెంట్లను సక్రమంగా తనఖీ చేయలేదన్నారు.
ప్రజాభద్రత విషయంలో రాజీపడ్డారని వారిపై విజిలెన్స్, ACB అధికారులతో విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యవహారంపై సెప్టెంబర్ 5న అధికారులకు సమర్పించిన వినతిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీ, ఏసీబీ డైరెక్టర్ జనరల్, నెల్లూరు జిల్లా కలెక్టర్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్, నెల్లూరు ఎస్పీ, నెల్లూరు నగర పాలక సంస్థ పూర్వ కమిషనర్లు హరిత, వికాస్ మర్మత్, డిప్యూటీ కమిషనర్ డి.చెన్నుడును వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.