By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 10:37 PM IST
వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం
TDP Janasena Coordination Meeting in Vijayawada : తెలుగుదేశం - జనసేన సమన్వయ కమిటీ సమావేశం రేపు(గురువారం) విజయవాడలో జరుగనుంది. క్షేత్రస్థాయిలో ఇరుపార్టీల సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. వివిధ జిల్లాల్లో పర్యటనకు సంబంధించి ప్రచార వ్యూహాలు, రూట్ మ్యాప్ తదితర అంశాలపైనా చర్చించనున్నారు. టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులుగా కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య ఉన్నారు. అదేవిధంగా జనసేన కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్వినిలు పాల్గొననున్నారు. ఏప్రిల్ మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, రేపు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ కీలక సమావేశం జరగనుంది.
అయితే రాష్ట్రంలో 2024 ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చి, రాజకీయాల్ని కీలక మలుపు తిప్పే పరిణామాలకు సంబంధించిన కీలక భేటీకి తెలుగుదేశం, జనసేనలు సిద్ధమయ్యారు. వైసీపీ (YSRCP) ప్రభుత్వ అరాచకాలు, ప్రజావ్యతిరేక విధానాలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇరు పార్టీలు ఆ ప్రక్రియను మరింత వేగంగా ముందుకి తీసుకెళ్లేందుకు భేటీలో చర్చించనున్నాయి. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల కేడర్ మరింత సమన్వయంతో పనిచేసేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా నిర్ణయాలు తీసుకోనున్నారు.