By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 5:25 PM IST
చంద్రబాబును కలిసిన తన్జీమ్ ఈ ముఫ్తియాన్ ప్రతినిధులు- ఎన్డీఏ కూటమికి మద్దతు - Tanzim e Muftiyan support for NDA
Tanzim e Muftiyan support for NDA alliance: ఎన్డీఏ కూటమికి జాతీయ సంస్థ తన్జీమ్ ఈ ముఫ్తియాన్ ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. హైదరాబాద్ లోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో సంస్థ ప్రధాన కార్యదర్శి షేక్ ఉల్ హదీస్ అల్లమా ముఫ్తీ జియా ఉల్లా ఖాన్ ఖాసిమి, కోశాధికారి అల్లమా ముఫ్తీ ఘుప్రాన్, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ ఇస్మాయిల్ ఖాసిమీ ఆయనను కలిశారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో యావత్ ముస్లిం సమాజం సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేస్తుందని వారు పేర్కొన్నారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ముస్లిం సమాజ సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని మర్చిపోలేమని తెలిపారు. ముస్లింలకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నా రాజధాని అమరావతి పూర్తి కావాలన్నా, తెలుగుదేశం బలపరిచిన అభ్యర్ధులకు మైనారిటీలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అమరావతి పరిధిలో అత్యధిక ముస్లింలున్నారనీ, జగన్ అమరావతిని నాశనం చేసి ముస్లింలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో ముస్లింలపై ఒక వైపు కిరాతక దాడులు, మరోవైపు బలవంతపు మతమార్పిడి జరగటాన్ని తీవ్రంగా ఖండించారు.