By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 1:38 PM IST
జగన్ మహిళలను మోసం చేస్తున్నారు : మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
Tanuku Ex MLA Radhakrishna Fires On Jagan: మహిళల పక్షపాతిని అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి అన్ని రంగాల్లో ఉన్న మహిళలను మోసం చేశారని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. మహిళలందరికి న్యాయం చేయటం కోసం టీడీపీ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చారని వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాధాకృష్ణ స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని ఈ సమావేశంలో రాధాకృష్ణ తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల ఆసరా పథకాల గురించి ఆర్బాట ప్రచారాలు తప్ప అందుకు తగిన స్థాయిలో ఆసరా ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఐదు లక్షల రూపాయలకు వడ్డీ మాఫీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ మొత్తాన్ని కూడా మూడు లక్షల రూపాయలకు తగ్గించి మోసగిస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మహిళలను మోసగించిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.