By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 10:22 AM IST
మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం- మేళతాళాలతో స్వామివారి ఊరేగింపు
Subramanyeswara Swamy Radhotsavam at Mopidevi: కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజున రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మేళతాళాలతో స్వామి అమ్మవార్లను రథంపై ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. గురువారం రాత్రి గ్రామంలో భక్తులతో సందడి నెలకొంది. గ్రామస్థులు స్వామి వారికి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు రథోత్సవాన్ని ప్రారంభించారు. స్వామి వారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ముగ్ధ మనోహరుడైన స్వామి వారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల పూజలందుకున్నాడు. బాణసంచా, కేరళ వాయిద్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అవనిగడ్డ సబ్ డివిజన్ నుంచి 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ను జాతీయ రహదారి మీదగా మళ్లించారు. స్వామి రథోత్సవాన్ని తిలకించడానికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, డీఎస్సీ మురళీధర్, సీఐలు నాగప్రసాద్, సర్పంచి నందిగం మేరీరాణి పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు