'విచారణకు రండి' - టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు - ap political updates
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 7:53 PM IST
Speaker Notices to TDP Rebel MLAs: టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitaram) నోటీసులు జారీ చేశారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిలను గురువారం మధ్యాహ్నం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు పిలిచినట్లు పిటిషనర్ టీడీపీ శాసనసభ పక్ష విప్ డోలా బాల వీరాంజనేయ స్వామికి స్పీకర్ కార్యాలయం తెలిపింది.
విచారణ సమయంలో హాజరు కావాలని స్వామికి సూచించింది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను స్పీకర్ మూడోసారి విచారణకు పిలిచారు. వైఎస్సార్సీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్(YSRCP and TDP Rebel MLAs Disqualification Petition)పై ఇప్పటికే మూడుసార్లు విచారణ జరిగింది. రెబెల్ ఎమ్మెల్యే ఆనం రెండు సార్లు హాజరు కాగా వాసుపల్లి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒక్కసారి హాజరు అయ్యారు. వంశీ, బలరాం, మద్దాలి ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు.
కాగా అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) సమీపిస్తున్న వేళ ఒక పార్టీ నేతలు మరో పార్టీలో చేరుతున్నారు. దీంతో పార్టీ నేతల కదలికలపై ఆయా పార్టీలు ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి బయటకొచ్చిన పలువురు నేతలు టీడీపీకి మద్దతు తెలపడంతో వీరిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇదే రూట్లో టీడీపీ కూడా గతంలో తమ పార్టీ నుంచి గెలిచి వైఎస్సార్సీపీలో చేరిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసింది.