రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్లు బదిలీలు - ప్రభుత్వం ఉత్తర్వులు జారీ - కేఎస్ జవహర్ రెడ్డి
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 8:14 PM IST
Senior IAS Transfers in Andhra Pradesh : రాష్ట్రంలో కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి (KS Jawahar Reddy) ఉత్తర్వులు ఇచ్చారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న బుడితి రాజశేఖర్ను, ఆ శాఖ కమిషనర్ ఎ. సూర్యకుమారిని ప్రభుత్వం ఒకేసారి బదిలీ చేసింది. బుడితి రాజశేఖర్ ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు సూర్యకుమారిని మత్స్యశాఖ కమిషనర్గా బదిలీ చేస్తూ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మత్స్యశాఖ కమిషనర్గా ఉన్న కె. కన్నబాబును పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా నియమించారు. పర్యాటకాభివృద్ధి కార్పోరేషన్ ఎండీ, ఏపీ టూరిజం సీఈఓగానూ కన్నబాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్కు పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన మైనారిటీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతల్ని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె. హర్షవర్ధన్కు అప్పగించారు. సెర్ప్ సీఈఓగా ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల వీసీఎండీ మురళీధర్ రెడ్డికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. అదనపు సీసీఎల్ఏ, సీసీఎల్ఏ కార్యదర్శిగా హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ వెంకటరమణా రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు.