By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 7, 2024, 11:14 AM IST
బాపట్లలో కారును తప్పించబోయి ఆటో బోల్తా - విద్యార్థులకు స్వల్ప గాయాలు - Students Auto Overturned
School Students Auto Overturned in Bapatla : బాపట్లలో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. పట్టణంలోని సూర్యలంక రోడ్డులో ఏజీ కాలేజ్ ఎదురుగా స్కూలు పిల్లలతో వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న కారుని తప్పించబోయి బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో 12 మంది విద్యార్థులు ఉన్నారు. బాపట్ల రూరల్ పరిధిలోని మున్నంవారిపాలెం గ్రామానికి చెందిన వీరంతా పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్కు రోజూ ఆటోలో వెళ్లి వస్తుంటారు. ఎప్పటిలాగే ఆటోలో బయలు దేరిన పిల్లలు అది బోల్తా పడటంతో ఒక్కసారిగా హాహాకారాలు పెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హటాహుటిన బాపట్లకు చేరుకున్నారు. గాయపడిన ఏడుగురిలో ఓ విద్యార్థి కాలు ఫ్రాక్చర్ అయింది. మిగతా పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అందరినీ గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఆటో బోల్తా పడిన ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉదయం పూట నిత్యం రద్దీగా ఉంటుందని, దీని వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు ప్రమాదాల కట్టడికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.