By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2024, 9:06 AM IST
షిప్పింగ్ కంపెనీలో విష వాయువులు విడుదల - ఐదుగురికి అస్వస్థత - Shipping incident in visakha
Pollutant Gas Release in Sravani Shipping Company in Visakha : విశాఖలోని పారిశ్రామికవాడ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో విష వాయువులు పీల్చి అయిదుగురు అస్వస్థతకు గురయ్యారు. శ్రావణి షిప్పింగ్ కంపెనీలో కెమికల్ పౌడర్ను కంటెయినర్ నుంచి లారీలోకి ఆన్లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా విషవాయువు లీకైంది. ఈ సంఘటనలో అక్కడే విధుల్లో ఉన్న కార్మికుల్లో అయిదుగురు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన సహా కార్మికులు వారిని గాజువాకలోని ప్రైవేటు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వీరిని వైద్యులు పరీక్షించి ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉందని తెలియజేశారు. మిగిలిన వారు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు.
షిప్పింగ్ కంపెనీలో ప్రమాదం జరిగి కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా యాజమాన్యం స్పందించలేదని బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న కార్మికులను విశాఖ పోలీస్ కమిషనర్ శంక బత్ర బాగ్చి పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిచాలని వైద్యులకు సూచించారు.