తప్పతాగి బస్స్టాండ్లో యువకుల హల్చల్ - పోలీసులు భలే పనిష్మెంట్ ఇచ్చారుగా!! - Police punishment To Youth
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jul 1, 2024, 2:16 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2024/640-480-21838959-thumbnail-16x9-youth.jpg)
Police Punished Youth in Peddapalli Bus Stand : మత్తు పదార్థాలు, మద్యం సేవించి బస్టాండ్లో బీభత్సం సృష్టించిన యువకులకు పోలీసులు వినూత్న రీతిలో గుణపాఠం చెప్పారు. ఈ ఘటన పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్లో జరిగింది. వివరాల్లోకి వెళితే, పెద్దపల్లి బస్టాండ్లోకి పలువురు యువకులు మద్యం, మత్తు పదార్థాలు సేవించి వచ్చారు. అందులోని ఓ షాపులోకి వెళ్లి ఓ యువకుడితో గొడవకు దిగి, అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. వారిని ఆపేందుకు వచ్చిన షాప్ నిర్వాహకులతో పాటు మరికొందరిపై దాడికి పాల్పడ్డారు.
ఈ క్రమంలో అందరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేయకుండా పనిష్మెంట్ ఇచ్చారు. ఆదివారం పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్కు తీసుకెళ్లి వారి చేతిలో ప్లకార్డులు పెట్టి పలు సూచికలతో ప్రచారం చేయించారు.
రాత్రి 11 గంటలు దాటిన తర్వాత బయట తిరగొద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని, రాత్రులు ఎక్కడా అల్లర్లు సృష్టించొద్దని ప్లకార్డులతో ప్రాంగణంలో నిలబెట్టారు. యువకులకు ఇచ్చిన గుణపాఠాన్ని ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చేసేందుకు సదరు యువకులకు ఇలా చేసినట్లు పెద్దపల్లి పోలీసులు వెల్లడించారు.