నడిరోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు - సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ - CONSTABLES FIGHT
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 10:36 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-05-2024/640-480-21396645-thumbnail-16x9-police-fight.jpg)
Constables Fight on Road in Satya Sai District : ప్రజలను రక్షించాల్సిన పోలీసులే నడిరోడ్డుపై కొట్టుకుంటున్న సంఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. రొళ్ల మండలంలోని పిల్లిగుండ్లు చెక్పోస్ట్ వద్ద నడిరోడ్డుపై ప్రయాణికులు చూస్తుండగానే ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టుకున్నారు. ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీలో భాగంగా పిల్లిగుండ్లు చెకోపోస్టులో రొళ్ల, ఆగళి పోలీసు స్టేషన్లకు చెందిన నారాయణస్వామి నాయక్, శివకుమార్ను నియమించారు.
ఆదివారం మధ్యాహ్నం వాహనాలను తనిఖీ చేస్తూ ప్రయాణికుల ఎదురుగానే ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని పిడిగుద్దులు గుద్దుకున్నారు. స్థానికులు ఇద్దరికి సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వారిని తొసుకుంటూ కొట్టుకున్నారు. పోలీసులు కొట్టుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఎవరైనా గొడవపడితే సర్ది చెప్పాల్సిన పోలీసులే ఇలా నడిరోడ్డుపై కొట్టుకుంటే ఇక శాంతిభద్రతలు ఎక్కడ ఉంటాయని ప్రజలు చర్చించుకున్నారు. విధుల నిర్వహణ విషయంలో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి గొడవకు దారి తీసినట్లు సమాచారం. ఈ విషయంపై రొళ్ల, అగళి ఎస్సైలు రాజశేఖర్, వీరేశ్ సంఘటనపై విచారణ చేసి ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.