By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 8:07 PM IST
అనుమతి లేకుండా ఐదు అంతస్తుల భవనం- గుడివాడ అమర్నాథ్పై ఫిర్యాదు - Complaint on Gudivada Amarnath
Peethala Murthy Yadav Complaint on Gudivada Amarnath: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ నేతల భూ ఆక్రమణలు, నిర్మాణాలపై ఎన్టీఏ నేతలు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అనుమతులు తీసుకోకుండా గాజువాకలో 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారని జనసేన నాయకుడు పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. అమర్నాథ్ పై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యాలయానికి సొంత భవనాల నిర్మాణాలకు నిబంధనలు పాటించకుండా వైఎస్సార్సీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని మూర్తియాదవ్ మండిపడ్డారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
"గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అనుమతులు తీసుకోకుండా గాజువాకలో 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనిపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాం. వైఎస్సార్సీపీ నేతల అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం." - పీతల మూర్తియాదవ్, జనసేన నాయకుడు