టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు - కోర్టులో లొంగిపోయిన పానుగంటి చైతన్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : 3 hours ago
Panuganti Chaitanya Surrender in Court : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు. దాడి ఘటనలో నిందితుడు ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఈ కేసులో చైతన్యను పోలీసులు ఏ1గా పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చైతన్య, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు. గుంటూరులో అప్పిరెడ్డి నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసే సెటిల్మెంట్లు, దందాల్లోనూ చైతన్యది కీలకపాత్ర. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు చైతన్యను ఏ1గా పేర్కొన్నప్పటికీ అరెస్ట్ మాత్రం చేయలేదు. లేళ్ల అప్పిరెడ్డితో పాటు వైఎస్సార్సీపీ అగ్ర నేతలతో ఉన్న సంబంధాల దృష్ట్యా పోలీసులు అతడిపై చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
Mangalagiri TDP Office Case Updates : ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లేళ్ల అప్పిరెడ్డి సహా మరికొందరిని పోలీసులు విచారిస్తుండడంతో చైతన్య అజ్ఞాతం వీడాడు. తన న్యాయవాది బ్రహ్మారెడ్డి ద్వారా మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నందున అతడు ఇచ్చే సమాచారం పోలీసులకు కీలకంగా మారనుంది. మరోవైపు దాడి వెనుక కుట్రదారులెవరో తేల్చేందుకు మంగళగిరి పోలీసులు చైతన్యను కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది.