మత్స్యకారులకు ఎమ్మెల్యే ద్వారంపూడి క్షమాపణలు చెప్పాలి: మల్లాడి కృష్ణారావు - జేఏసీ మత్స్యకారుల సమావేశం
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 7:47 PM IST
MLA Dwarampudi Should Apologize to Fishermen Community: మత్స్యకార జాతిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ ఏపీ మత్స్యకార నేతలు డిమాండ్ చేశారు. కాకినాడలో మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని జేఏసీ నాయకులు, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. ఫిబ్రవరి 17న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతిపై చేసిన వ్యాఖ్యలకు వారం రోజుల్లో స్పందించాలన్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులంతా ఏకమై ఆందోళనలు చేస్తామని మల్లాడి కృష్ణారావు వెల్లడించారు. అహంకార ధోరణితో తమ జాతిని అవమానించిన ఎమ్మెల్యే ద్వారంపూడికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఏపీ ఫిషర్మెన్ జేఏసీ ఛైర్మన్ సైకం రాజశేఖర్ హెచ్చరించారు.
మత్స్యకార జాతిని ఉద్దేశించి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే క్షమాపణలు చెబితే ఇంతటితో వదిలేస్తాం. జాతిని ఉద్దేశించి ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడిన వ్యక్తికి సరైన సమయంలో సమాధానం చెబుతాం. రాజకీయంగా వైరం ఉంటే రాజకీయ నేపథ్యంలోనే చూసుకోవాలి తప్ప మా కులాల్ని అనే హక్కు మీకు ఎవరు ఇచ్చారు. -మల్లాడి కృష్ణారావు, పుదుచ్చేరి మాజీ మంత్రి