Published : Aug 30, 2024, 7:18 PM IST
మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి భవిష్యత్తులో సీఎం అవుతారు : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి - Rajagopal Reddy Key Comments
Komatireddy Rajagopal Reddy Sensational Comments : మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి భవిష్యత్తులో సీఎం అవుతారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటి పారుదల శాఖ పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారంటూ వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది. తన నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, తాను మాట్లాడితే నిజం అవుతుందని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని బునాది గాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువ ద్వారా వేల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగు నీరు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని, కాలువలను సరిగా పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ ఖర్చు చేసిందని మండిపడ్డారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాలువలు వెడల్పు చేయాలని, లైనింగ్, బ్రిడ్జిల నిర్మాణం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. కాలువలను వెడల్పు చేయటం ద్వారా దాదాపు 400 గ్రామాలు, 5 నియోజకవర్గాల్లో లబ్ధి పొందుతారని తెలిపారు. గతంలో పునాది గాని కాలువ కోసం చాలా కష్టపడ్డానని వెల్లడించారు.