'సాక్షి' అబద్ధాలనే పదేపదే ప్రచారం చేస్తోంది: మంత్రి నారాయణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
Minister Narayana Comments on Sakshi: వరద సాయంపై ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేకే వైఎస్సార్సీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని తప్పు దోవ పట్టించేలా వరదల్లో బురద రాజకీయం చేయటం వైఎస్సార్సీపీ నేతలకే చెల్లిందని మండిపడ్డారు. వరద సాయంపై రాసిన అబద్ధాలనే పదేపదే సాక్షి ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. విజయవాడకు అంత పెద్ద వరద విపత్తు వచ్చి తగ్గాక కనీసం 2-3 వేల మందైనా ఆసుపత్రిల్లో అంటువ్యాధులు ప్రబలి చేరాలి కానీ ఎక్కడా అంటువ్యాధులు ప్రబల లేదంటే ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణమని వెల్లడించారు.
ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరూ అభినందించారని తెలిపారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని అన్నారు. డ్రోన్ల ద్వారా ఆహారం అందించామని గుర్తు చేశారు. ప్రజలకు జరిగిన మేలు ఓర్వోలేకే జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే విధంగా ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. వరదల్లో పెట్టిన ఖర్చుపై ఎవరికేం లెక్కలు కావాలో ఇప్పటికే బయటపెట్టామని తెలిపారు. ఇంకా ఎవరికైనా లెక్కలు కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసి తెప్పించుకోవచ్చన్నారు.