నూతన క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా న్యాయవాదులు నిరసన - అమలును నిలిపివేయాలని డిమాండ్ - AGITATION AGAINST NEW CRIMINAL LAWS
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 4:43 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2024/640-480-21839819-thumbnail-16x9-agitation-against-new-criminal-laws.jpg)
LAWYERS AGITATION AGAINST NEW CRIMINAL LAWS: ప్రజా వ్యతిరేక నూతన క్రిమినల్ చట్టాల అమలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు పేద ప్రజలకు వ్యతిరేకంగా, ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
90 శాతం పాత చట్టాలనే అమలు చేస్తున్నామని చెబుతూ కొత్తగా కోర్టులకు, పోలీసులకు, అధికారులకు అనుకూలంగా విశేషాధికారాలు కట్టబెట్టే విధంగా చట్టాలను తీసుకువచ్చారన్నారు. తక్షణమే నూతన చట్టాల అమలును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం న్యాయవాదు లు కలెక్టర్ కు నూతన చట్టాల అమలు నిలిపివేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
కాగా బ్రిటిష్ వలస పాలన కాలంనాటి చట్టాలకు ముగింపు పలుకుతూ న్యాయ వ్యవస్థలో కీలక మార్పులను తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చింది. నేటి నుంచి దేశంలో కొత్త నేర చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అమల్లోకి వచ్చాయి.