బాపట్ల జిల్లాలో విషాదం- భార్యను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న భర్త - HUSBAND KILLED WIFE - HUSBAND KILLED WIFE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 5:58 PM IST
Husband killed Wife and Suicide in Bapatla District : కొందరు క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గోరుతో పోయే దానికి గొడ్డలి ఉపయోగించినట్లు.. కూర్చోని మాట్లాడుకుంటే పోయేదానికి క్షణికావేశానికి లోనై కాటికి పయనమౌతున్నారు. ఇలాంటి ఘటనే బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.
రేపల్లె మండలంలోని మైనేనివారిపాలెంకి చెందిన సీతా మహాలక్ష్మి(50), బాబూరావు(55) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు కాగా అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో దంపతులిద్దరే జీవనం సాగిస్తున్నారు. అయితే నిన్న(సోమవారం) రాత్రి బాబూరావు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీంతో భార్య, భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య మాట మాట పెరిగి మద్యం మత్తులో ఉన్న బాబురావు ఒక్కసారిగా కర్ర తీసుకొని భార్య తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్త స్రావం అవ్వడంతో కొద్దిసేపటికే భార్య సీతామహాలక్ష్మి మృతి చెందింది. అనంతరం బాబూరావు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు(మంగళవారం) ఉదయం ఇంటికే వచ్చిన చిన్న కుమారుడు ఇంట్లో జరిగిన ఉదంతాన్ని చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే విషయాన్ని బంధువులకు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన చేరుకుని మృత దేహాలను పరిశీలించారు.