భారీ వర్షానికి కొట్టుకుపోయిన వేరుశనగ - నిస్సహాయస్థితిలో రైతులు - Heavy Rain Farmers Loss Crop - HEAVY RAIN FARMERS LOSS CROP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2024, 9:35 PM IST
Heavy Rain in Kurnool Farmers Loss Crop: కర్నూలు జిల్లా ఆదోని, ఆస్పరి మండలాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ తడిచి రైతులకు నష్టం మిగిలింది. సోమవారం యార్డుకు 11 వేల బస్తాలు వేరుశనగ అమ్మకానికి రైతులు తెచ్చారు. మార్కెట్ యార్డులో వసతులు సరిగా లేక వేరుశనగ వర్షానికి తడిసింది. సరకు తెచ్చిన రైతులకు నిల్వ ఉంచడానికి సరిగా వసతులు లేక ఇబ్బంది పడ్డారు. వరద నీటి తాకిడికి చాలా వరకు సరకు కొట్టుకుపోతూ కనిపించడంతో పాటు అన్నదాతలు చెమ్మగిల్లిన కళ్లతో చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ఇక షెడ్ల కింద ఉంచిన సరకుకు సైతం వర్షం తాకిడితో, అరడుగు మేర నీరు నిలిచి తడిచిపోయేలా చేసింది. దీంతో టెండర్ పూర్తి అయినా, సరకు దక్కించుకున్న వ్యాపారులు కొనుగోలుకు విముఖత చూపడంతో రైతులు గట్టిగా నిలదీశారు. చివరికి తడిసిన సరకుకు, బస్తాకు నాలుగైదు కిలోల చొప్పున కమిషన్ తీసుకుని, సరకు తూకాలు వేసినట్లు రైతులు తెలిపారు.
మరోవైపు భారీ వర్షానికి ఆస్పరి మండలంలోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. కనుచూపు మేరల్లోని పొలాలన్నీ చెరువును తలపిస్తున్నాయి. ఆస్పరి నుంచి జొహరాపురానికి వెళ్లే రహదారిలో నల్లవాగు పొంగి ప్రవహించటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.