Published : 2 hours ago
పొలం నిండా ఇసుక మేటలు, బండరాళ్లు - పంటంతా పోయింది బతికేదెలా? - Farmer Worried Due To Loss Of Crops
Farmer Worried Due To Loss Of Crops : గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ఓ రైతు కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయి నేటికీ తేరుకోలేకపోతోంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సోమ్లా తండాకు చెందిన భూక్యా అజాఫ్ సింగ్ - నీలా దంపతులకు మూడెకరాల సాగు భూమి ఉంది. ఇందులో అర ఎకరంలో మిర్చి, రెండున్నర ఎకరాలు వరి సాగు చేశారు. పంట పెట్టుబడి కింద రూ.60 వేల వరకు ఖర్చు చేశారు. ఈ క్రమంలో భారీ వర్షాలకు నర్సింహులపేట మండలం గొల్ల బంజర శివారులోని రాయిని బంధం చెరువు కట్ట తెగింది. దీనికి వచ్చిన వరద నీరంతా వరి పైరు మీదుగా ప్రవహించడంతో పంటంతా దెబ్బతింది.
పొలం నిండా బండరాళ్లతో నిండిపోయింది. వీటిని తొలగించేందుకు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎటు చూసినా ఇసుక మేటలు, రాళ్లే కనిపిస్తుండడంతో గుండె నిండా భారంతో దంపతులు రాళ్లు తొలగించే పనులు ప్రారంభించారు. సాగు సవ్యంగా ఉన్నట్లయితే ఈ పాటికే పంట చేతికి వచ్చేదని, తమకు రాళ్లు మోసే కష్టం తప్పేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆదుకుని పంట పొలంలోని రాళ్లను తొలగించాలని కోరుతున్నారు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు రాక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయామంటూ బోరుమంటున్నారు.