By ETV Bharat Andhra Pradesh Team
Published : 3 hours ago
వానకు చెదిరిన గూడు - ఐదేళ్లుగా బాత్రూంలోనే కుటుంబం - Family Staying in Bathroom
Family Staying in Bathroom Since 5 Years in Satya Sai District : వానకు వాళ్ల గూడు చెదిరిపోయింది. ఇల్లు కట్టుకునే స్థోమత లేదు. కూలి చేసి పొట్ట గడుపుకునే కుటుంబం. నిలువ నీడలేక సాయం కోసం అర్థించారు. గత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వారికి ఇల్లు కట్టిస్తానని నమ్మబలికారు. కానీ అది మాటగానే మిగిలిపోయింది. దంపతులు సహా ఇద్దరి పిల్లలతో వాళ్లు బాత్రూంలో తల దాచుకుంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా అదే వాళ్లకు దిక్కు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం హెచ్.ఆర్.పాలెం గ్రామంలో నరసింహప్ప అతని భార్య కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వారి మట్టి మిద్దె వర్షానికి కూలిపోయింది. తిరిగి ఇంటిని నిర్మించుకొనే స్థోమత లేక ఇంటికి అనుసంధానంగా ఉన్న బాత్రూమ్లోనే నరసింహప్ప, అతని భార్య లక్ష్మీదేవి, ఇద్దరు పిల్లలు ఐదు సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. కనీసం కూర్చునేందుకే ఇబ్బందిగా ఉన్న ఆ బాత్రూంలోనే కాలాన్ని సాగిస్తుందీ కుటుంబం. వర్షం వచ్చినప్పుడు ప్రభుత్వ భవనాలకు వెళ్లి తలదాచుకుంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం కనికరించలేదని, కూటమి ప్రభుత్వమైనా తమకు నివాసం కల్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.