"జరుగు, జరుగు" ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులను దూరం పెట్టిన రోజా- నెటిజన్లు ఫైర్ - Netizens Trolls on EX Minister Roja
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 17, 2024, 11:13 AM IST
EX Minister Roja Arrogance on Sanitation Workers Video Viral Netizens Trolls : మాజీ మంత్రి, నటి రోజా వైఖరి మరోసారి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమిళనాడులోని ఓ ఆలయంలో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనతో సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఆమె దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గతంలోనూ "దూరంగా ఉండడానికి నేనేమైనా ఎస్సీ, ఎస్టీనా" అని చేసిన వ్యాఖ్యలతో ఆమె విమర్శలపాలయ్యారు. కాగా, మరో సారి ఇదే తరహాలో సోషల్ మీడియాలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే!
తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సోమవారం వరుషాభిషేకం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా, ఆమె భర్త సెల్వమణి స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడున్న చాలామంది వారితో సెల్ఫీ తీసుకున్నారు. అదే సమయంలో కొందరు పారిశుద్ధ్య కార్మికులు వెళ్లగా వెంటనే ఆమె వారిని దూరం జరిగి నిల్చోవాలంటూ చేతులతో సైగ చేశారు. దీంతో వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకోగా ఆ తర్వాత వచ్చిన వారంతా రోజాతో కలిసి ఫొటోలు తీసుకోవడం గమనార్హం. రోజా తీరుపట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.