సీఎం పర్యటనతో 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన బస్సులు - ప్రజల అవస్థలు - Public Problems in CM Jagan meeting
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 4:19 PM IST
CM Jagan Meeting in Ongole Public Problems: నవరత్నాల్లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఉన్న ఎన్ అగ్రహారం వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి అగ్రహారం దగ్గరకు లబ్ధిదారులకు పట్టాలు అందించే క్రమంలో నియోజకవర్గం నుంచి వెయ్యికి పైగా ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్, కాలేజీ బస్సులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. బాపట్ల నుంచి 20 బస్సులు తరలించడంతో, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సుల కోసం గంటల తరబడి బస్టాండు, రోడ్డుపై పడిగాపులు కాశారు.
మరోవైపు సీఎం సభ జరిగే కార్యక్రమం వరకూ మట్టి రోడ్డు ఉంది. బస్సులు సభ దగ్గరకు వెళ్లే మార్గంలో రెండు కిలోమీటర్లు వరకు ఉన్న ఈ రోడ్డు చిన్నగా ఉంది. దీంతో కొప్పోలు నుంచి అగ్రహారం వరకూ 2 కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు, స్కూల్ వ్యాన్లు నిలిచిపోయాయి. గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ జామ్ అయ్యి అరగంటకు పైగా వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.