By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 1:34 PM IST
దిల్లీకి చంద్రబాబు - అమిత్షాతో భేటీపై చర్చోపచర్చలు
Chandrababu Delhi Tour: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్షాతో భేటీ అయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నేడు దిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు దిల్లీ పర్యటన ఎందుకు అని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తు పెట్టుకోగా వీరితో పాటు బీజేపీ కూడా పొత్తులో చేరే అవకాశం ఉందని చంద్రబాబు పర్యటన ద్వారా ఆసక్తి రేకెత్తిస్తోంది. పొత్తు కోసమే బీజేపీ నేతలతో చంద్రబాబు దిల్లీ పయనమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
ఈ రోజు రెండు గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్న ఆయన ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు దిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాత్రికి అక్కడే బస చేయనున్న చంద్రబాబు రాత్రి, లేదంటే రేపు అమిత్షాతో సమావేశం అవుతారు. రేపు సాయంత్రం తిరిగి అమరావతికి తిరిగి రానున్నారు.