రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు - అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 4:33 PM IST
Appsc Group 2 Screening Exam Arrangements : రేపు (ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా జరిగే గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్షకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆయన ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని కావున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉదయం 10.30.గం.ల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ సజావుగా జరిగేందుకు నిరంతర పర్యవేక్షణ ఉండేలా 24 మంది అఖిలభారత సర్వీసు అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను నియమించినట్టు సీఎస్ వివరించారు.
పరీక్షాకేంద్రాల్లో 24 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించినట్టు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు కోసం 3,971 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. దీంతో పాటు పరీక్ష ముగిసిన వెంటనే జవాబుపత్రాలు, ఇతర సామాగ్రిని నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు వీలుగా 900 ఎస్కార్టు సిబ్బందిని నియమించామని వెల్లడించారు. ఏపీపీఎస్సీ(APPSC) నుంచి 51 మంది అధికారులు కూడా పర్యవేక్షిస్తారన్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.