వర్గీకరణపై ఒక్క అడ్వకేట్ను పెట్టలేదు- చేతివృత్తులకు ఉపాధి లేకుండా చేశాడు : విజయవాడ ఎమ్మార్పీఎస్ రౌండ్టేబుల్ - AP MRPS Round Table Meeting
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 4:09 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-04-2024/640-480-21168189-thumbnail-16x9-ap.jpg)
AP MRPS Round Table Meeting: విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 35 మాదిగ కులాల సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మాదిగలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చే ఐదు సంవత్సరాలు గడిచినా, మాదిగ కార్పొరేషన్కు ఒక రూపాయి కూడా నిధులు కేటాయించలేదని విమర్శించారు. సీఎం జగన్ చేతివృత్తులకు ఉపాధి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్ట్లో ఎస్సీ వర్గీకరణపై వైసీపీ మాదిగల పక్షాన ప్రభుత్వం ఒక్క అడ్వకేట్ను కూడా పెట్టలేదని ఎమ్మార్పీఎస్ నేతలు ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై నోరుమెదపని సీఎం జగన్, మాదిగలకు వ్యతిరేకంగా మారారని ఆయా సంఘాలు దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు సామాజిక న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మాదిగలకు 15 సీట్లు కేటాయించి సామాజిక న్యాయం చేసిందని ఎమ్మార్పీఎస్ నేతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీతో మాదిగల అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా, తెలుగుదేశం తరపున ఆయా జిల్లాల్లో ప్రచారం చేస్తామన్నారు.