పుంగనూరులో ఉద్రిక్తత- మిథున్ రెడ్డి పర్యటనను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు - Alliance Leaders Protest
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 4:11 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/640-480-21832545-thumbnail-16x9-alliance-leaders-protest.jpg)
Alliance Leaders and Activists Protest Against MP Mithun Reddy : చిత్తూరు జిల్లా పుంగనూరులో కూటమి నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి పుంగనూరులో పర్యటించనున్నట్లు ప్రకటించడంతో కూటమి నేతలు నిరసనకు దిగారు. పుంగనూరు అంబేద్కర్ కూడలిలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి గో బ్యాక్ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. గడచి ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అధికారం కోల్పోయాక పుంగనూరు పర్యటన పేరుతో ప్రజల మధ్య విధ్వేషాలు రగిలించేందుకు యత్నిస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. వారు అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది అన్యాయానికి గురయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధిపొందేందుకు చేసే పర్యటనలు అంగీకరించమని కూటమి నాయకులు ప్రకటించారు.
ఎంపీకి పోలీసు నోటీసులు: ఎన్నికల ఫలితాల అనంతరం పుంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ పాల్పడుతోందని ఎంపీ మిధున్ రెడ్డి ఆరోపించారు. పుంగనూరు పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎంపీకి శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయని పోలీసులు నోటీసులు అందజేశారు. తమ కార్యకర్తలను పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తాము అండగా ఉంటామన్నారు.