Windows Crash Issue : టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ కొత్త కొత్త సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. అయితే ఆ ముప్పును ముందుగానే పసిగట్టి లావాదేవీలకు ఇబ్బంది లేకుండా వాటిని అధిగమించేందుకు సాంకేతిక నిపుణులు నిరంతరం శ్రమిస్తుంటారు. ఈ క్రమంలో 2000లో డెస్క్టాప్ యుగం నడుస్తున్న సమయంలో వై2కే రూపంలో వచ్చిన ఉపద్రవం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2వేల సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ విండోస్ సిస్టమ్లో సాంకేతిక సమస్య టెక్ యూజర్లను కలవరపెట్టింది. 1999 డిసెంబర్ 31 తర్వాత తేదీ మారే సమయంలో సమస్యలు వస్తాయనే ఆందోళన వ్యక్తమైంది. దీన్నే వై2కే లేదా మిలీనియం బగ్గా వ్యవరిస్తుంటారు.
1960-80 మధ్యకాలంలో డేట్ ఫార్మాట్లో సంవత్సరానికి 2డిజిట్ల కోడ్ను కంప్యూటర్ ఇంజినీర్లు వాడేవారు. డేటా స్టోరేజీ తగ్గించేందుకు సంవత్సరంలో తొలి 2 డిజిట్లు మినహాయించి చివరివి మాత్రమే ఉపయోగించేవారు. ఈ డేట్ ఫార్మాటే ఆందోళనకు కారణమైంది. 00ను 2వేల సంవత్సరంగా కాకుండా 1900గా సిస్టమ్ అర్థం చేసుకుంటుందనే ఆందోళన ప్రోగ్రామర్లలో నెలకొంది. వై2కే బగ్ సమస్యపై బ్యాంకింగ్సహా అనేక రంగాలు ఆందోళన చెందాయి. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధమైన సాఫ్ట్వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్తోపాటు హార్డ్వేర్లోనూ మార్పులు చేయాలని నిర్ణయించాయి.
ఇందుకోసం వై2కే కంప్లయింట్ ప్రోగ్రాంను అందుబాటులో తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. అందుకు వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని దిగ్గజ టెక్ సంస్థలు అంచనా వేశాయి. కానీ వై2కే ముప్పు నుంచి టెక్ ప్రపంచం తేలిగ్గానే బయటపడింది. 2డిజిట్ల డేట్ ఫార్మాట్ను 4డిజిట్లకు మార్చడం ద్వారా సమస్యను అధిగమించారు. అంతా ఊహించినట్లు కాకుండా చాలాతేలికగ్గా టెక్ ప్రపంచం మిలీనియమ్లోకి అడుగుపెట్టింది. సమస్య చిన్నదే అయినా వై2కే ముప్పు గురించి అతిగా ప్రచారం చేశారనే వాదన కూడా ఉంది.
ఆ తర్వాత 24 ఏళ్లకు మైక్రోసాఫ్ట్ విండోస్లో ఏర్పడిన సాంకేతిక సమస్య ఐటీ సేవలను కుదిపేసింది. క్రౌడ్ స్ట్రైక్ అనేది అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ. 2011లో ఏర్పడిన ఈ సంస్థకు సైబర్ దాడులను దీటుగా ఎదుర్కొంటుందనే పేరుంది. విండోస్తోపాటు ఐటీ దిగ్గజ సంస్థలు, బ్యాంకింగ్, ఎయిర్లైన్స్కు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అందిస్తుంది. అందుకే అమెరికా ప్రభుత్వ విభాగాలు కూడా ఈ సర్వీసులు పొందుతున్నాయి. విండోస్ సిస్టమ్స్లో నెలకొన్న బ్లూస్క్రీన్ ఎర్రర్కు క్రౌడ్ స్ట్రైక్ నుంచి వచ్చిన అప్డేట్ కారణమని తేల్చారు. సిస్టమ్లు షట్డౌన్ లేదా రీస్టార్ట్ కావటం వల్ల అనేక రంగాల సేవలకు అంతరాయం ఏర్పడింది.
సత్యనాదెళ్ల స్పందన
మైక్రోసాప్ట్ విండోస్ సమస్యపై సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. "నిన్న క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్డేట్ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించాం. సిస్టమ్లను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కస్టమర్లకు అవసరమైన మద్దతు సమకూర్చేలా క్రౌడ్ స్ట్రైక్తో కలిసి పనిచేస్తున్నాం" అని పోస్ట్ చేశారు. అయితే ఈ చర్య ఆటోమోటివ్ సరఫరా గొలుసును దిగ్బంధించిందంటూ ఎలాన్ మస్క్ కామెంట్ చేశారు.
Yesterday, CrowdStrike released an update that began impacting IT systems globally. We are aware of this issue and are working closely with CrowdStrike and across the industry to provide customers technical guidance and support to safely bring their systems back online.
— Satya Nadella (@satyanadella) July 19, 2024
ప్రయాణికుల ఓపిక, సహకారం ప్రశంసనీయం!
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయిన కారణంగా దేశీయ విమానాశ్రయాల్లో ఊహించని జాప్యం జరుగుతోందని పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మెహన్నాయుడు తెలిపారు. బాధిత ప్రయాణికులకు అదనపు సీట్లు, తాగునీరు, ఆహారం తదితర సదుపాయాలు కల్పించాలని విమానాశ్రయవర్గాలు, ఎయిర్లైన్స్ సంస్థలను ఆదేశించినట్లు చెప్పారు. ప్రయాణికుల ఆందోళనను అర్థం చేసుకోగలమన్న కేంద్ర మంత్రి, సురక్షితంగా, గమ్యస్థానాలకు వేగంగా తరలించేందుకు నిర్విరామంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల ఓపిక, సహకారం ప్రశంసనీయమని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు.
10 బ్యాంకులపై మైక్రోసాఫ్ట్ ప్రభావం
విండోస్లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా భారత్లోని 10 బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై స్వల్ప ప్రభావం పడినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించింది. అయితే, ఇది స్వల్ప అంతరాయమేనని, వాటిలో కొన్ని ఇప్పటికే పరిష్కరించినట్లు స్పష్టం చేసింది. చాలా బ్యాంకుల కీలక వ్యవస్థలు క్లౌడ్లో లేవని, కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్ స్ట్రైక్ వినియోగిస్తున్నాయని ఆర్బీఐ తెలిపింది.